కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో ఈ రోజు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ పై ఏపీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. కేంద్ర బడ్జెట్ వల్ల ఎవరికీ ఉపయోగం లేదని యనమల అన్నారు. విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన ఏ హామీని బడ్జెట్లో ప్రస్తావించలేదన్నారు. ప్రత్యేకహోదా, ఆర్థికలోటు, రాజధాని, పోలవరంపై ప్రస్తావనే లేదని చెప్పారు.
కేంద్రం నిధులు ఇవ్వకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. నవరత్నాల అమలుకు రాష్ట్రానికి రూ. 42వేల కోట్లు అవసరమన్నారు. అప్పు తీసుకురావడానికి ఎఫ్ఆర్బీఎం చట్టం అనుమతి ఇవ్వదని యనమల స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న పథకాలను రద్దు చేస్తేనే సాధ్యం అవుతుందని యనమల పేర్కొన్నారు.