*వైఎస్సార్ వాహన మిత్ర కింద 10 వేలు సాయం
*దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక సాయం
*తమది పేదల ప్రభుత్వం.. పేదలకు అండగా ఉండే ప్రభుత్వం
వైఎస్సార్ వాహనమిత్ర నాలుగో విడత నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు నాలుగో విడతగా వైఎస్సార్ వాహన మిత్ర కింద 10 వేలు ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు జగన్. అంతకు ముందు ఆయన ఆటో డ్రైవర్లతో ఫొటోలు దిగారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..వరుసగా నాలుగో విడత 261 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 261.51 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం కలిగిన వారికి ఆర్థిక సాయం అందజేస్తున్నామని సీఎం అన్నారు.ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందచేస్తున్నామన్నారు.
ఇప్పటి వరకూ వాహనమిత్ర పథకం కింద ఒక్కొక్కరికి నలభై వేలు ఇచ్చామని, మొత్తం వెయ్యికోట్లు ఖర్చు చేశామని జగన్ అన్నారు. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్ల నుంచి చలాన్ల రూపంలో వందల కోట్ల రూపాయలు గుంజారని జగన్ ఆరోపించారు.
తాను పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన 4 నెలల్లోనే ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఈ సాయం అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలోనూ వాహన మిత్ర పథకం అమలు చేశాం.తమకు తామూ స్వయం ఉపాధి కల్పించుకుని.. ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారన్నారు.
మనది పేదల ప్రభుత్వం.. పేదలకు అండగా ఉండే ప్రభుత్వమని సీఎం వైఎస్ జగన్అ న్నారు.చంద్రబాబు ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను గమనించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారు.
నలుగురు ధనికుల కోసం, దత్తపుత్రుడి కోసం నడిచే ప్రభుత్వం తమది కాదన్నారు సీఎం.చంద్రబాబుకు ఎల్లోమీడియా, దత్తపుత్రుడు అండగా ఉండి పదే పదే అబద్దాలను నిజమనే ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. కానీ తనకు నిబద్దత, నిజాయితీ, ప్రజల తోడు, దేవుడు ఆశీర్వాదం ఉందన్నారు.
ఎక్కడా కూడా లంచాలు లేవు, వివక్ష లేదన్నారు. కులం చూడలేదు, పార్టీ చూడలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. అప్పటి ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని సీఎం కోరారు.