సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఈ రోజు జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన అధికార తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు ప్రచారం జరిగింది. టీడీపీ లో చేరి భిమిలీ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. వాటిని లక్ష్మీనారాయణే స్వయంగా ఖండించిన సంగతి తెలిసిందే. టీడీపీలో తాను చేరడం లేదని లక్ష్మీనారాయణ తేల్చిచెప్పారు.
లక్ష్మినారాయణ టీడీపిలో చేరుతారనే వార్తలు రాగానే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. తమ పార్టీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తును ప్రస్తావిస్తూ చంద్రబాబుకు, లక్ష్మినారాయణకు ఉన్న బంధం బయటపడిందని వైసీపీ ఆరోపించింది.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయంతో లక్ష్మినారాయణ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో నేడు జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాను జనసేనలో చేరనున్నట్టు లక్ష్మీనారాయణ మీడియాకు వెల్లడించారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకోనున్నారు.