telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సెలక్షన్ కమిటీ అంటే.. అక్కడ బిల్లు పరిస్థితి ఏంటో..

Ap Assembly

ఏపీ శాసనమండలిలో ప్రస్తుత ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ షరీఫ్ నిర్ణయించారు. ఐతే.. ఇప్పుడు ఏం జరుగుతుందనే ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. అసలు సెలక్ట్ కమిటీ అంటే ఏంటి? దాన్ని విధులు ఏంటి? సెలక్ట్ కమిటీకి పంపడం వల్ల వైసీపీకి నష్టం జరుగుతుందా? టీడీపీకి లాభం జరుగుతుందా? మండలిలో ప్రతిపక్షం పట్టుదల కారణంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులు సెలక్ట్‌ కమిటీకి పంపిచారు చైర్మన్‌ షరీఫ్‌. తన విచక్షణాధికారంతో చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐతే.. ఓ బిల్లు వల్ల ప్రజలకు భారీగా నష్టం జరుగుతుందని భావిస్తేనే సభ్యులు సెలక్ట్ కమిటీకి పంపాలని కోరతారు. మరోవైపు శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపాదించింది కాబట్టి.. మండలి నుంచే సదరు కమిటీని కూడా ఎంపిక చేయాల్సి ఉంటుంది.

శాసనసభలో స్పీకర్ కమిటీలను నియమిస్తారు. శాసనమండలిలో చైర్మన్ కమిటీ సభ్యలను ఎంపిక చేస్తారు. ఐతే.. శాసనమండలిలో ఏయే పార్టీకి ఎంత మంది సభ్యులు ఉన్నారో తెలుసుకుని.. వారి పర్సంటేజీ ప్రకారం ఆయా పార్టీలకు ప్రాతినిధ్యం ఉండేలా కమిటీ సభ్యులను నియమిస్తారు. అంటే ప్రస్తుతం శాసనమండలిలో టీడీపీకి మెజారిటీ సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి చెందిన వారే ఎక్కువ మంది సెలక్ట్ కమిటీలో ఉంటారు. సెలక్ట్‌ కమిటీ గరిష్టంగా 3 నెలల్లో తమ నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. బిల్లుల్ని సెలక్ట్‌ కమిటీకి పంపిచడం వెనక అమరావతి ఉద్యమాన్ని సజీవంగా ఉంచేందుకు టీడీపీ అనుసరించిన వ్యూహమే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఒకవేళ బిల్లులు ఆమోదం పొందితే.. అమరావతి ఉద్యమం నీరుగారిపోతుందనే టీడీపీ ఈ అస్త్రం ప్రయోగించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లిన తర్వాత.. ఆ కమిటీ సభ్యులు బిల్లు వల్ల ప్రభావితం అయ్యే వారి వాదనలను వింటారు. అంటే అమరావతి రైతులతో పాటు విశాఖపట్నం, కర్నూలు జిల్లాల వారి వాదనలను కూడా వినాలి. మొత్తం 13 జిల్లాల్లోని వారి అభిప్రాయాలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిపుణులు, వివిధ వర్గాల వారి అభిప్రాయాలను తెలుసుకుంటుంది. అనంతరం ఆ బిల్లులో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే వాటిని ప్రతిపాదిస్తుంది. అనంతరం ఆ బిల్లును మళ్లీ అసెంబ్లీకి పంపుతుంది. సెలక్ట్ కమిటీ పరిశీలించి రూపొందించిన బిల్లును అసెంబ్లీలో చర్చిస్తారు. అక్కడ చర్చించి ఆమోదించిన తర్వాత మరోసారి శాసనమండలికి వస్తుంది. ఐతే.. సెలక్ట్ కమిటీ ప్రతిపాదించిన సూచనలు, సలహాలకు మళ్లీ శాసనసభలో సవరణలు ప్రతిపాదించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఓ రకంగా సెలక్ట్ కమిటీ ప్రతిపాదించే సూచనలకు శాసనసభలో మళ్లీ మార్పులు ఉండొచ్చు. ఆ తర్వాత మళ్లీ మండలికి వెళ్తుంది. అక్కడ ఆమోదం పొందితే ఓకే. ఒకవేళ బిల్లు ఆమోదం పొందక పోతే రెండోసారి శాసనసభలో అదే బిల్లును ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించినట్టుగా తేల్చుతారు.

Related posts