మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకలు చాలా కష్టపడ్డారని శివసేన ప్రశంసలు కురిపించింది. లోక్ సభలో ప్రతిపక్ష పార్టీ హోదా పొందేందుకు అవసరమైన సీట్లు కాంగ్రెస్ కు వస్తాయని తెలిపింది. ఈ మేరకు తన పత్రిక సామ్నాలో ప్రత్యక కథనాన్ని ప్రచురించింది.
మోదీ మరోసారి ప్రధాని అవుతారని చెప్పడానికి రాజకీయ పండితులు అవసరం లేదని శివసేన వ్యాఖ్యానించింది. మోదీని మళ్లీ ప్రధానిని చేయాలనే నిర్ణయానికి ప్రజలు ఎప్పుడో వచ్చేశారని తెలిపింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లతో పాటు మమతాబెనర్జీ రాష్ట్రమైన పశ్చిమబెంగాల్ లో కూడా బీజేపీకి క్లియర్ మెజార్టీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయని చెప్పింది. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి చారిత్రాత్మక విజయం సాధిస్తుందని తెలిపింది. ఏది ఏమైనప్పటికీ కచ్చితమైన ఫలితాల కోసం 23వ తేదీ వరకు వేచి చూద్దామని వెల్లడించింది.