గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి పట్ల సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ బాలు ఇక లేరనే వార్త జీర్ణించుకోలేనిదని ఆమె అన్నారు. ‘కోట్లాదిమందికి గానామృతాన్ని పంచిన శ్రీ ఎస్పీబీ త్వరగా కోలుకుని మళ్ళీ తన గానంతో అలరిస్తారని ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో బాలు లేరన్నా వార్త తీవ్రంగా కలచివేసిందన్నారు.గాయకుడిగా, సంగీత దర్శకునిగా నటునిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఎస్పీబీ ఎంత ఎత్తుకు ఎదిగినా చివరి క్షణం వరకూ వినయ విధేయతలతో ఒదిగే ఉంటూ ఎంతో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు.
తన అపార అనుభవాన్ని ఎందరో యువతీయువకులకు పంచి మన సంగీత వారసత్వం భావితరాలకు అందాలని కృషిచేశారు. పాట ఉన్నంత కాలం శ్రీ ఎస్పీబీ మన హృదయాల్లో సదా నిలిచే ఉంటారు. బాలు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.