నిన్న ఐపీఎల్ 2020 లో రాజస్థాన్తో తలపడిన మ్యాచ్లో హైదరాబాద్ బ్యాట్స్మెన్ విజయ్ శంకర్(52*), మనీష్ పాండే(83*) అర్ధశతకాలతో రాణించారు. వీరిద్దరూ చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఈ క్రమంలోనే 140 పరుగుల భాగస్వామ్యం జోడించడం విశేషం. 2013 తర్వాత హైదరాబాద్ టీమ్కు ఇద్దరు భారత బ్యాట్స్మెన్ శతక భాగస్వామ్య పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఈ మధ్యలో 23 సార్లు శతక భాగస్వామ్యాలు చేసినా అందులో ఒక విదేశీ ఆటగాడు ఉన్నాడు. దీంతో మనీష్, విజయ్ కొత్త రికార్డు నెలకొల్పారు. మరోవైపు విజయ్ శంకర్ 2018 సీజన్లో చివరిసారి అర్ధశతకం బాదాడు. అప్పుడు దిల్లీకి ఆడిన అతడు చెన్నైతో తలపడిన మ్యాచ్లో 54 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అయితే ధోనీసేన విజయం సాధించింది. గతేడాది నుంచీ హైదరాబాద్ తరఫున ఆడుతున్న విజయ్ ఇప్పుడు మళ్లీ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన విజయ్ తన ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. మనీష్తో కలిసి తాను మ్యాచ్ను విజయ తీరాలకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. తామిద్దరం బ్యాటింగ్ చేసేటప్పుడు ఇదే విషయాన్ని చర్చించుకున్నామని, క్రీజులో పాతుకుపోయి విజయం సాధించాలనే పట్టుదలతో ఆడినట్లు పేర్కొన్నాడు.