దేశంలో ఆసక్తిరేపుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉత్తరప్రదేశ్ తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు బారులుతీరారు.
యూపీలో 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 623 మంది అభ్యర్థుల తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ బరిలో.. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ- ఆర్ఎల్డీ, ఆప్, ఎంఐఎం పార్టీలు పోటీలో ఉన్నాయి.తొలిదశ పోలింగ్లో ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివస్తున్నారు.
అధికారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం తప్పనిసరి చేసింది. ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసింది ఈసీ.
పోలింగ్ కేంద్రాల వద్ద 50 వేలమంది పారామిలిటరీ సిబ్బందిని మోహరించింది.ఉత్తర్ప్రదేశ్లోని మొత్తం 403 అసెంబ్లీస్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.