కరోనా నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా..సర్వదర్శనం టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. టికెట్లు ఇలా ఓపెన్ చేశారో లేదో వెంటనే ఖాళీ అయ్యాయి.
అలాగే టీటీడీ అధికారులు రేపటి (డిసెంబర్ 28) నుంచి శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. జనవరి, ఫిబ్రవరి కోటాను రేపు మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేయనున్నారు.
ఇందులో భాగంగా జనవరి 1న వెయ్యి బ్రేక్ దర్శన టికెట్లు(రూ.500).. జనవరి 13న వైకుంఠ ఏకాదశి రోజు వెయ్యి మహాలఘు దర్శన టికెట్లు(రూ.300) అందుబాటులో ఉంచనున్నారు. ఇక 2022 జనవరి 14నుంచి 22వరకు రోజుకు 2వేలు చొప్పున లఘు దర్శన టికెట్లు(రూ.500) విడుదల చేయనున్నారు.
మిగిలిన రోజులలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకి 200 చొప్పున ..శని,ఆదివారాలలో రోజుకి 300 చొప్పున బ్రేక్ దర్శన టికెట్లు విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది.