ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఆ పార్టీ అధిష్ఠానం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. దీంతో, కన్నా లక్ష్మీనారాయణను కావాలనే అధ్యక్ష పదవి నుంచి తప్పించారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ప్రచారంపై వీర్రాజు స్పందించారు. కన్నాను తప్పించి… ఆయన స్థానంలో తనను నియమించారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చెప్పారు.
దేశంలో చాలా చోట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను కొత్త వారిని నియమించారని వీర్రాజు తెలిపారు. బీజేపీలో వ్యక్తి ముఖ్యం కాదని.. ఏపీలో బీజేపీ, జనసేన మైత్రిని మరింత పటిష్టం చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఇంటి స్థలాల కార్యక్రమంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వైసీపీ నేతల అవినీతిని ఎండగడతామని హెచ్చరించారు.