ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం ఉన్న, ధనవంతుడైన దేవుడుగా తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి పేరు పొందాడు. దక్షిణ భారతంలో ఇంతకు మించి ప్రాచుర్యంలో ఉన్న దేవుడు మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. తిరుపతి వెంకన్నగా భక్తులు పిలుచుకుంటారు. టీటీడీ తరపున తిరుపతిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ముంబై, జమ్మూకాశ్మీరుల లోనూ శ్రీవెంకటేశ్వర ఆలయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. శనివారం జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే టీటీడీ తరుఫున ముంబైలో దేవాలయం నిర్మించేందుకు రూ.30 కోట్లు కేటాయించారు. ఉత్తర భారతదేశంలో జమ్మూకశ్మీర్లో కూడా వెంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించాలని నిర్ణయించారు. దీని కోసం భూమి కేటాయించాల్సిందిగా అక్కడి ప్రభుత్వానికి లేఖ రాస్తారు. అదే విధంగా ప్రధాని నరేంద్రమోడీ నియోజకవర్గం వారణాసిలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించడానికి బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. యూపీ గవర్నమెంట్కు భూ కేటాయింపుకు లేఖ రాయనున్నారు. తిరుమలలోని వరహా స్వామి ఆలయానికి రాగి రేకులు, బంగారు పనులు చేపట్టేందుకు రూ.14 కోట్లతో టీటీడీ ఖజానా నుంచి బంగారం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.