telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

అండర్‌-19 : ..దక్షిణాఫ్రికాను చిత్తుగా .. ఓడించిన భారతజట్టు..

india win on southafrica under-19

రెండో వన్డేలో దక్షిణాఫ్రికా పై భారత్‌ జట్టు 8 వికెట్ల ఘన విజయం సాధించింది. బర్త్‌డే బాయ్‌ యశస్వి జైశ్వాల్‌ ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ముందుగా బంతితో ప్రత్యర్థులను వణికించిన ఈ యువ స్పిన్నర్‌ తర్వాత బ్యాట్‌తో సత్తా చాటాడు. అర్ధ సెంచరీ చేయడంతో పాటు 4 వికెట్లు పడగొట్టి తన 18వ పుట్టినరోజును తీపిగుర్తుగా మలచుకున్నాడు. 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 2 వికె​ట్లు కోల్పోయి 16.2 ఓవర్లలోనే ఛేదించింది. యశస్వి అజేయ అర్థసెంచరీతో భారత్‌ సునాయాసంగా విజయం సాధించింది. 56 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జురెల్‌ 26 పరుగులు చేయగా, ప్రియం గార్గ్‌ డకౌటయ్యాడు.

దక్షిణాఫ్రికా టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసి, భారత బౌలర్ల ధాటికి 29.5 ఓవర్లలోనే 119 పరుగులకు ఆలౌటైంది. యశస్వి 4 వికెట్లు నేల కూల్చాడు. ఆకాశ్‌ సింగ్‌, అంకోలేకర్‌, రవి బిష్ణోయ్‌ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. యశస్వి జైశ్వాల్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అందుకున్నాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ 2-0తో భారత్‌ సొంతమయింది. తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను యువ భారత్‌ చిత్తు చేసింది. నామమాత్రమైన మూడో వన్డే సోమవారం జరుగుతుంది. కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్‌ వేలం లో యశస్విని రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ రూ.2.4 కోట్లకు సొంతం చేసుకుంది. యశస్వి తాజా ప్రదర్శనతో రాజస్థాన్‌ రాయల్స్‌ ఖుషీగా ఉంది. రోడ్డుపై పానీపూరీలు అమ్మే స్థాయి నుంచి ముంబై సీనియర్‌ జట్టు వరకు ఎదిగిన సంచలన ఆటగాడు యశస్వికి భారీ మొత్తం లభించడం విశేషం.

Related posts