తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై టీ-కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు.ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఎస్సార్టీసీని ప్రైవేట్ పరం చేయాలని సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ తనకు కావాల్సిన కొంతమందికి ఆర్టీసీని అప్పగించాలని చూస్తున్నారని ఆరోపించారు. టీఎస్సార్టీసీని ఎవరికి దోచిపెట్టాలనుకుంటున్నారో త్వరలో బయట పెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ తనకు కావాల్సిన వారికి ఆర్టీసీ బ్యాటరీ బస్సులను అప్పగించారని విమర్శించారు. న్యాయమైన కోర్కెల సాధన కోసం పోరాడుతున్న ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చాక కూడా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నించకపోగా, ఒక్క మాటతో ఉద్యోగాలు పోయినట్టుగా భావించాలన్న కేసీఆర్ మనస్తత్వాన్ని అందరూ గమనించాలని సూచించారు. కేసీఆర్ కు అధికారం తలకెక్కి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.