వీలైనంత త్వరలోనే ఈ-పాస్ పోర్టులు రానున్నాయి. చిప్ రూపంలో వీటిని తీసుకురానున్నారు. ప్రాధాన్యతా ప్రాతిపదికన జారీ చేసే సరికొత్త ‘ఈ-పాస్పోర్టు’ల రూపకల్పనకు ప్రతిపాదించామని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తెలిపారు. ఆధునిక భద్రతా ప్రయోజనాలతో కూడిన పాస్ పోర్టులు అందుబాటులోకి తేవాలన్నదే లక్ష్యమన్నారు. సోమవారం(జూన్ 25,2019) ‘7వ పాస్పోర్టు సేవా దివస్’ కార్యక్రమంలో మంత్రి ఈ విషయాలు తెలిపారు. చిప్తో కూడిన ఈ-పాస్పోర్టులు జారీ చేసేందుకు సంబంధిత ప్రాజెక్టుపై ”ఇండియా సెక్యూర్టీ ప్రెస్”తో మంత్రిత్వ శాఖ చర్చించనున్నదని మంత్రి జైశంకర్ వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్స్తో కూడిన పాస్పోర్టు బుక్లెట్ సమీప భవిష్యత్తులోనే అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి లోక్సభ నియోజకవర్గంలో కొత్త పోస్టాఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాలను (పిఓపిఎస్కె)ను ప్రారంభించే ప్రక్రియను తమ మంత్రిత్వ శాఖ కొనసాగిస్తుందన్నారు.
పిఓపిఎస్కెలు లేని నియోజకవర్గాలలోనే వీటిని ఏర్పాటు చేస్తుందన్నారు. పిఓపిఎస్కెలను త్వరగా ప్రారంభించేందుకు విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖలు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నాయన్నారు. ఏడాదికి కోటికి పైగా పాస్ పోర్టులు జారీ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. గత ఐదేళ్లలో పాస్పోర్టు విధానంలో ఓ సమగ్ర ఉద్యమాన్నే తీసుకొచ్చామన్నారు. పారదర్శకమైన పాలన, బాధ్యతతో కూడిన పౌర సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. 2017 నుంచి ఇప్పటి వరకు 412 పీఓపీఎస్కేలు ఏర్పాటు చేసినందుకు కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు మంత్రి జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే 93 కొత్త పాస్పోర్టు కేంద్రాలను సైతం ఏర్పాటు చేయగా అవి ప్రస్తుతం సేవలందిస్తున్నాయన్నారు. పాస్పోర్టుకు పోలీస్ వెరిఫికేషన్ సమయం సైతం 2018లో 19 రోజులకు తగ్గిందన్నారు.