తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ పెరిగింది. నిన్న రాత్రి నుంచి వెల్లువలా భక్తులు రావడంతో, అద్దె గదులకు కొరత ఏర్పడింది. శ్రీవారి సర్వదర్శనానికి ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 16 గదుల్లో భక్తులు సర్వదర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీరికి దర్శనమయ్యేందుకు కనీసం 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. మిగతా అన్ని రకాల దర్శనాలకూ 3 గంటల సమయం పడుతోందని తెలిపారు.
నిన్న శ్రీవారిని 60,485 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో వెంకన్న తెప్పోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలోనే భక్తుల సంఖ్య పెరిగిందని అధికారులు అంచనా వేశారు. క్యూ లైన్లలో వేచివున్న భక్తులకు అన్న పానీయాలు నిరంతరాయంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ ఉదయం పుష్కరిణిలో స్వామివారు శ్రీ కృష్ణుని అవతారంలో విహరించనున్నారు.