లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మొన్నటి వరకు రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. దీంతో వన్యప్రాణులు రోడ్లపైకి వస్తున్నాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇంతవరకూ చిరుతపులులు జనావాసాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంచిర్యాల సమీపంలో రహదారిపైకి ఓ పెద్దపులి వచ్చింది. దీని దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.
విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలిని సందర్శించారు. ఇక ఈ వ్యాఘ్రరాజం ఎటువైపు వెళ్లిందన్న విషయమై ఎటువంటి సమాచారమూ లేదని అధికారులు తెలిపారు. దీని కదలికలపై ఆరా తీస్తున్నామని, సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామని తెలిపారు. గతంలో కూడా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న పట్టణాల రోడ్లపై పులి సంచారం చేసినట్టు అధికారులు దృవీకరించారు.