వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విరుచుకుపడ్డారు. భూసేకరణ పేరిట కోట్లరూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ’50 వేల రూపాయలు ఇస్తేనే పేదవాడికి ఇంటిస్థలమా? అడిగితే బెదిరింపులు.. దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. వందలకోట్ల కుంభకోణం.. ఇంత విధ్వంసం ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఈ విషయమై ప్రజల తరపున చంద్రబాబు అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారు’ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ‘రూ.50 వేలు’ ఇస్తేనే జాగా పేరిట పలు పత్రికల్లో వచ్చిన వార్తలను దేవినేని ఉమ పోస్ట్ చేశారు. రైతుల నుంచి తక్కువ ధరకే భూములు కొన్నామని, సదరు రైతుకు లబ్ధిదారులే అదనపు మొత్తం చెల్లించాలంటూ అధికార పార్టీ నేతలు కొన్ని చోట్ల కొత్త కుంభకోణానికి తెరలేపారని అందులో ఉంది. ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.35 వేల నుంచి 50 వేల వరకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. భూ సేకరణ వ్యయం పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారని ఆ పత్రికలో కథనాలున్నాయి.