telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు సాంకేతిక సామాజిక

యూఎస్ నేవీ పైలట్ అధికారిణిగా తెలుగమ్మాయి దేవిశ్రీ

devisri

గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన దొంతినేని శ్రీనివాస్, అనుపమల కుమార్తె దేవిశ్రీ అమెరికాలో నేవల్ ఫైలట్ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించి తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని మరోసారి ప్రపంచం ముందుంచారు. న్యూయార్క్ సమీపంలోని లాంగ్ ఐలాండ్ లో పుట్టిన దేవిశ్రీ, పదో తరగతిలో ఉన్న సమయంలోనే నేవీలోకి వెళ్లాలని స్ఫూర్తి పొంది, ఆ దిశగా కసరత్తు చేసి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) దేవిశ్రీని ప్రత్యేకంగా అభినందించింది. ఆమె తన భవిష్యత్తులో తన పదవికి వన్నె తెచ్చేలా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నామని పేర్కొంది.

devisri

దేశానికి సేవ చేయాలన్న ఆలోచన తనకు మొదటి నుంచీ ఉండేదని, తల్లిదండ్రులు తన నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ప్రోత్సహించారని ఈ సందర్భంగా దేవిశ్రీ వ్యాఖ్యానించారు. వారి ప్రోత్సాహంతోనే తాను ఈ స్థితికి చేరానని అన్నారు. దేవిశ్రీ తల్లిదండ్రులు శ్రీనివాస్, అనుపమ ఉద్యోగరీత్యా 30 ఏళ్ళ కిందటే అమెరికాలోని లాంగ్ ఐలాండ్ లో స్థిరపడ్డారు. దేవిశ్రీ ఇంటి సమీపంలో కెన్నత్ అనే నేవీ అధికారి ఉండేవారు. ఆయన స్పూర్తితో అమెరికన్ నేవిలో చేరాలనుకుంది దేవిశ్రీ. అయితే అత్యంత్య శక్తివంతమైన అమెరికా నావికా దళానికి ఎంపిక కావడం అనేది సాధారణ విషయం కాదు. ఈ మేరకు ఇంటర్ తరువాత నేవీ అకాడెమీ ప్రవేశ పరీక్షకు హాజరైంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 50 రాష్ట్రాల నుంచి 17,000 దరఖాస్తులు వచ్చాయి. అన్ని రకాల పరీక్షలు, వడపోతలు అనంతరం 17,000 మందిలో 1000 మందిని మాత్రమే ఎంపిక చేశారు. అందులో ఒకరిగా నిలిచి నావెల్ అకాడమీకి ఎంపికైన తొలి భారత సంతతి యువతిగా రికార్డు సృష్టించింది దేవిశ్రీ.

devisri

2016 జూన్‌లో దేవిశ్రీ శిక్షణ మొదలైంది. బరువులు మోస్తూ పరుగెత్తడం, ఎత్తులు దూకడం, నీటిపై రోజులకొద్దీ ప్రయాణించడం, కఠిన వాతావరణ పరిస్థితుల్లో గుండె నిబ్బరం కనబరచడం.. ఒకవేళ శత్రువుల చెరలో చిక్కుకుంటే అన్నిరకాల బాధల్ని ఓర్చుకునేలా శిక్షణ ఉండేది. ఈ సమయంలో ఏడాదికి రెండు, మూడుసార్లే ఇంటికి పంపించేవారు. ఈ కష్టాలు భరించలేక చాలామంది శిక్షణ ఆరు వారాల్లోపే వదిలేసి వెళ్లిపోయేవారు. కానీ దేవిశ్రీ మాత్రం పట్టుదలగా లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేసింది. అలా నాలుగేళ్ల కష్టతర శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకుంది. దేవిశ్రీకి గాలిలో ఎగరడం అత్యంత ఇష్టం కావడంతో నేవీ పైలట్‌ కెరీర్‌ను ఎంచుకుంది. ఈ ఏడాది జూన్‌ నుంచి ఫ్లోరిడాలో మరో రెండేళ్లు శిక్షణ ఉంటుంది. ఇందులో ఫ్లైట్‌ ప్లాన్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌ పర్ఫార్మెన్స్‌, వాతావరణంలో మార్పులు గమనించడం, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌, రాడార్‌, నేవిగేషన్‌ వ్యవస్థలన్నింటిపై పట్టు సాధించబోతోంది. ఆయుధాలు ఉపయోగించడమూ నేర్చుకోబోతోంది.

devisri

శిక్షణ అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా నావికా దళ బేస్‌లలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది. వీటన్నింటికీ సిద్ధపడిన తర్వాతే నేవీకి దరఖాస్తు చేశానంటోంది దేవిశ్రీ. మొత్తానికి దేవిశ్రీ అమ్మానాన్నల ప్రోత్సాహంతో అనుకున్నది సాధించి నేటి యువతకు నేటి యువతకు ఆదర్శంగా నిలిచింది.

Related posts