telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ “గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్ర‌యాణికుల కోసం ‘టి-9 టికెట్’*

*పల్లె వెలుగు బస్సుల్లో మహిళలు, సీనియర్‌ సిటిజన్లకు వ‌ర్తింపు*

*రూ.100 చెల్లిస్తే 60 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే వెసులుబాటు*

*ఎల్లుండి నుంచి ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి టికెట్*

*‘టి-9 టికెట్’ పోస్టర్ ను ఆవిష్కరించిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్*

గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం ‘టి-9 టికెట్’ అందుబాటులోకి తెచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను ఇప్పటికే అందిస్తోన్న సంస్థ..  తొలిసారిగా గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికుల సౌకర్యార్థం టి-9 టికెట్ ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

హైదరాబాద్ లోని బస్ భవన్ లో శుక్ర‌వారం ‘టి-9 టికెట్’ పోస్టర్ ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆవిష్కరించారు. ఈ టికెట్ ఈ నెల 18(ఆదివారం) నుంచి పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

‘టి-9 టికెట్’ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు వర్తిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుంది. ఈ టికెట్ ద్వారా 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చెయొచ్చు. ‘టి-9 టికెట్’ కు రూ.100  ధరగా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. టోల్ గేట్ చార్జీల‌పైన మిన‌హాయింపు ఇచ్చింది. దీంతో ఈ టికెట్ ద్వారా ఒక్కోక్కరికి రూ.20  నుంచి రూ.40 వ‌ర‌కు ఆదా అవుతంద‌ని సంస్థ ప్ర‌క‌టించింది.

60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు వయసు ధృవీకరణ కోసం తమ ఆధార్ కార్డును కండక్టర్లకు చూపించి టి-9 టికెట్ పొందవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ టికెట్లను కండక్టర్లు ఇస్తారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుంది.

“పల్లె వెలుగు బ‌స్సుల్లో ప్రతి రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అందులో మహిళలు, సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఉన్నారు. వారికి ఆర్థికభారం తగ్గించాలనే ఉద్దేశంతోనే పల్లెవెలుగు బస్సుల్లో ‘టి-9 టికెట్’కు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ఈ టికెట్ తో రూ.100  చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించవచ్చు. గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని సంస్థను ఆదరించాలి.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను అందుబాటులోకి తెచ్చామని, వాటికి ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని గుర్తు చేశారు. ఆ టికెట్లకు మంచి స్పందన వ‌స్తుండ‌టంతో తొలిసారిగా గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికుల కోసం ‘టి-9 టికెట్’ను తీసుకువచ్చామని చెప్పారు. ఈ టికెట్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.

‘టి-9 టికెట్’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)లు, పీవీ ముని శేఖర్, పురుషోత్తం, కృష్ణ కాంత్, సీటీఎం జీవన్ ప్ర‌సాద్‌, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్‌, సీఎఫ్ఎం విజ‌య‌పుష్ఫ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts