తెలంగాణ లో నిజామాబాద్ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కవితపై 185 మంది రైతులు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పై పోటీ చేసేందుకు తెలంగాణ పసుపు రైతులు సిద్ధమయ్యారు. వారణాసి లోక్ సభ స్థానం నుంచి మోదీకి వ్యతిరేకంగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ గ్రామీణం ప్రాంతాలకు చెందిన 50 మంది రైతులు వారణాసికి వెళ్లి రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు మద్దతు ధర విషయంలో కేంద్రం అలసత్వానికి నిరసనగానే తాము వారణాసిలో పోటీకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. వారణాసిలో పోటీ సందర్భంగా తాము ఎవరికీ వ్యతిరేకంగా ప్రచారం చేయబోమని రైతులు తెలిపారు. పసుపుబోర్డు, మద్దతుధర కోసం తాము చేసిన పోరాటాన్ని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు మద్దతుగా వారణాసికి తమిళనాడుకు చెందిన రైతులు కూడా వస్తున్నారని పేర్కొన్నారు.