*మేడ్చల్లో నూతన కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్
*మేడ్చల్ జిల్లా అవుతుందని ఎవరూ ఉహించలేదు..
*జాతీయ రాజకీయాల్లో కూడా గుణాత్మకమైన మార్పు రావాలి..
*మతం కులం పేరిట దేశాన్ని వీడదీసే కుట్ర జరుగుతుంది
*నీచ రాజకీయాలు కోసం ఎంతకైనా తెగించే వారు ఉంటారు..ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వారు ఎప్పటికీ ఉంటారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అలాంటి వారి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.
మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం అంతాయిపల్లి దగ్గర నిర్మించిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. కొందరు
కులం,మతం పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారని .. ఏమాత్రం మోసపోయినా గోస పడతామని ప్రజలను సీఎం హెచ్చరించారు. ఇప్పుడిప్పుడే మనం కోలుకుంటున్నామని, ఈ శాంతిని, స్వేచ్ఛను, మన ఆస్తుల్ని కాపాడుకోవాలని సీఎం ప్రజలను కోరారు.
మేడ్చల్ జిల్లా అవుతుందని ఎవరూ అనుకోలేదని తెలంగాణ ఏర్పాటు వల్లే ఇది సాధ్యమైందని సీఎం కేసీఆర్ అన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందన్నారు.
పరిపాలనా భవనాన్ని గొప్పగా నిర్మించుకున్నామన్నారు. కేవలం ఆరు నెలల వ్యవధిలో భవనాలు నిర్మించామని చెప్పారు. 11వేలకు పైగా ప్లే గ్రౌండ్స్ సిద్ధమవుతున్నాయన్నారు. మరో 10లక్షల కొత్త పెన్షన్లు ఇస్తున్నామని తెలిపిన సీఎం కేసీఆర్.. అందరికీ కొత్త కార్డులు ఇస్తున్నామన్నారు. తెలంగాణలో కరెంటు కష్టాలు తీరిపోయాయని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కావడం వల్లే ఇది సాధ్యమయిందన్నారు.
తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం రూ.లక్ష ఉండేదన్నారు సీఎం కేసీఆర్. ఇవాళ రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.2,78,500. దేశంలోనే ఇది అత్యధికమన్నారు. ఇవాళ మన జీఎస్డీపీ రూ.11.55లక్షల కోట్లని… బారతదేశంలో అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. అవినీతి రహిత పాలన వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు.
58 సంవత్సరాల పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నామన్న సీఎం కేసీఆర్.. భారత దేశంలోనే సముజ్వల రాష్ట్రంగా తెలంగాణ ఉండాలన్నారు.