telugu navyamedia
క్రీడలు వార్తలు

శాంసన్ అందుకే అలా చేసాడు : సంగక్కర

పంజాబ్ కింగ్స్‌తో నిన్న ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 4 పరుగులతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. కెప్టెన్ సంజూ శాంసన్(119) సెంచరీతో పోరాడినా ఫలితం లేకుండాపోయింది. అయితే అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఆఖరి ఓవర్లో రాజస్థాన్‌ విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. తొలి నాలుగు బంతుల్లో 0,1,1,6 మొత్తం 8 పరుగులు వచ్చాయి. దాంతో రాజస్తాన్‌ గెలుపునకు 2 బంతుల్లో 5 పరుగులు అవరసమయ్యాయి. ఐదో బంతిని సామ్సన్‌ లాంగ్‌ఆఫ్‌ వద్దకు ఆడగా… మోరిస్‌ సింగిల్‌ కోసం వచ్చాడు. కానీ సామ్సన్‌ సింగిల్‌ తీయకుండా ఉండిపోయాడు. దాంతో చివరి బంతికి రాజస్థాన్‌ గెలుపునకు 5 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే కీలక సమయంలో శాంసన్ సింగిల్ తీయకపోవడాన్ని కొంతమంది మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. ఈ విమర్శలపై మ్యాచ్ అనంతరం స్పందించిన కుమార సంగక్కర.. శాంసన్‌ సింగిల్ తీయకపోవడం సరైందేనని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ ఫినిష్ చేయగలననే నమ్మకం అతనికి ఉంది కాబట్టే అలా చేశాడని, చివరి బంతిని కూడా దాదాపు సిక్స్‌గా మలిచే ప్రయత్నం చేశాడన్నాడు. కానీ దురదృష్టవశాత్తు బంతి బౌండరీ‌కి కొన్ని అడుగుల ముందు పడిపోయిందన్నాడు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితుల్లో సులువుగా సిక్సర్ బాదేస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.

Related posts