telugu navyamedia
ఆంధ్ర వార్తలు

హిందూపురాన్ని సత్యసాయి జిల్లా కేంద్రంగా ప్రకటించాలి- బాల‌కృష్ణ‌

హిందూపురాన్ని సత్యసాయి జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మరోసారి డిమాండ్ చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ. శనివారం అఖిలపక్ష నేతలతో కలిసి.. హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  హిందూపురం జిల్లా కేంద్రంగా చేసేంతవరకు ఎంత వరకైనా పోరాటం చేస్తామని ప్రకటించారు. అందుకోసం అవసరమైతే సీఎం జగన్‌ ను కలుస్తానంటూ పేర్కొన్నారు.

పుట్టపర్తిని జిల్లాగా చేయడం అక్కడి ప్రజలకే ఇష్టం లేదని బాలకృష్ణ అన్నారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే తమ డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచామని.. వారి స్పందనను బట్టి కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికే.. జిల్లాల వివాదాన్ని తీసుకొచ్చారంటూ విమర్శించారు. ఒక చిన్న మండల కేంద్రాన్ని జిల్లా కేంద్రం చేయడం వెనుక ఆంతర్యం ఏంటి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సత్యసాయి జిల్లాకు తాము వ్యతిరేకం కాదని.. హిందూపురం జిల్లా కేంద్రం చేయాలన్నదే తమ డిమాండ్ అని పేర్కొన్నారు.

ఎన్టీ రామారావు మీద ప్రేమతో ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేయలేదని.. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయంటూ బాలకృష్ణ పేర్కొ్న్నారు. అంత ప్రేమ ఉంటే అన్నా కాంటీన్లను ఎందుకు తొలగిస్తారంటూ ప్రశ్నించారు. నిజమైన ప్రేమతో ప్రభుత్వం వ్యవహరించడం లేదని, గత ప్రభుత్వం చేసిన వాటిని నిర్వీర్యం చేశారన్నారు. ఎన్టీఆర్ విగ్రహాల విధ్వంసంపై ఏమి మాట్లాడడం లేదని ప్ర‌శ్నించారు.

సినిమా టికెట్ల వివాదంపై ఇప్పటికే తన అభిప్రాయాన్ని సినీ పెద్దలకు తెలియజేశానని తెలిపారు. అన్ని విషయాల్లోనూ ఈ ప్రభుత్వం వివాదం సృష్టిస్తోందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఏమి జరుగుతోంది ? ప్రజల మనోభావాలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వాళ్లు చేసిన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ చేస్తోందని అన్నారు.

Related posts