ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ తొలిసారిగా స్పందించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హిందూపురం ఎన్టీఆర్ సర్కిల్లోని ఎన్టీఆర్విగ్రహానికి బాలకృష్ణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. తెలుగు జాతిని ప్రపంచం నలుమూలల చాటిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని బాలయ్య అన్నారు. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఏపీకి ముఖ్యమంత్రి అయిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు.
టీడీపీకి కార్యకర్తలే కొండంత బలమని ఆయన అన్నారు.ఈ ఐదేళ్లలో కార్యకర్తలకు అండగా ఉండి అభివృద్ధికి కృషి చేస్తానని బాలయ్య చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అభివృద్ధి చేసినప్పటికీ.. ప్రజలు వైసీపీకి ఓటు వేయడం బాధ కలిగిస్తోందన్నారు.తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకు అధికారాన్ని పంచిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని బాలయ్య కొనియాడారు. .గతంకంటే ఎక్కువ మెజారిటీతో నన్ను గెలిపించిన కార్యకర్తలకు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.