పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై సీఎం జగన్ వివరణ ఇవ్వాలని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా జలవనరులు మంత్రి లేకుండానే కీలక చర్చలు జరిపారని విమర్శించారు.
అధికారులు, ఇంజినీర్లు లేని ఆ సమావేశంలో కాంట్రాక్టర్లతో 4 గంటల పాటు చర్చలు జరిపారని ఉమ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో జగన్ చిత్రవిచిత్రాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సింగిల్ టెండర్ ద్వారా ఎలాంటి వెసులుబాట్లు ఇచ్చారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం ద్వారా పోలవరం పనులు మరో 28 నెలలు ఆలస్యం అవుతాయని అన్నారు.