డీడీలు కట్టిన వారందరికీ గొర్రెల పంపిణీ చేస్తామని తెలంగాణ పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లాలో జాతీయ కృత్రిమ గర్భధారణ రెండో దశ కార్యక్రమాన్ని , మంత్రి హరీశ్ రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ..పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు.
నరేగా కింద అర్హులైన వారందరికీ పశువులు, గొర్రెల షెడ్లను మంజూరు చేస్తామని మంత్రి తలసాని తెలిపారు. సిద్దిపేట నమూనాగా అన్ని జిల్లాల్లో గొర్రెల షెడ్లు నిర్మిస్తామని తెలిపారు. అలాగే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. పాడి పై ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని అన్నారు.