యావత్ ప్రపంచమే మన వైపు చూస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం చివరిరోజు జన్మభూమిపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని అన్నారు. భవిష్యత్తులో ప్రపంచ దృష్టి ఏపీ డేటా సేవలపైనే ఉంటుందని చెప్పుకొచ్చారు. కేంద్రం దేనికీ సహకరించకున్నా తమ కష్టంతో ముందుకు వెళ్తున్నామన్నారు.
మనది బలహీన బృందమని చిన్నచూపు చూశారు. ఆ బృందంతోనే అద్భుతాలు సృష్టించి, 670 అవార్డులు సాధించామన్నారు. అధికార, ఉద్యోగ బృందాన్ని చూసి గర్విస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. ఏపీఆర్టీజీని టోనీ బ్లెయిర్, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అభినందించారన్నారు. ఒక్కరోజులోనే రూ.లక్ష కోట్ల పెట్టుబడులు ఒక చరిత్ర అని సీఎం పేర్కొన్నారు. జన్మభూమిలో వినతుల సంఖ్య తగ్గడమే తమ పనితీరుకు నిదర్శనమన్నారు. రేపటి నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.