ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడకపోతే మనం రెండు పాయింట్లు కోల్పోతామని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ తో ఆడకూడదనే డిమాండ్లు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన శత్రుదేశమైన పాకిస్థాన్ తో ఆడి, వారిని చిత్తుగా ఓడించాలని అన్నారు. పాక్ తో మనం మ్యాచ్ ఆడకపోతే అది ఆ దేశంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.
ప్రపంచకప్ లో రెండు పాయింట్లను కోల్పోవడమంటే చిన్న విషయం కాదని స్పష్టం చేశారు. టోర్నమెంట్ నుంచి బాధతో నిష్క్ర్రమించే అవకాశాలు కూడా ఉంటాయని తెలిపారు. పాక్ తో మనం ఆడి, ఆ జట్టు సెమీస్ కు చేరకుండా అడ్డుకట్ట వేయాలని తెలిపారు. పాకిస్థాన్ తో ఆడకున్నా, నాకౌట్ కు క్వాలిఫైకాగల సత్తా టీమిండియాకు ఉందనే విషయం తనకు తెలుసని తెలిపారు. పాక్ ను నిషేధించాలనే ప్రతిపాదనను ఇతర దేశాలు అంగీకరించవని తెలిపారు. ఇది రెండు దేశాల మధ్య సమస్య అని ఇందులోకి తమను లాగవద్దని ఇతర దేశాలు చెప్పే అవకాశం ఉందని గవాస్కర్ వెల్లడించారు.