విశాఖపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళుతున్న తన తల్లిని కామెంట్ చేసాడని ఓ యువకుడు వ్యక్తిని నడిరోడ్డుపై వెంటాడి బండరాయితో కొట్టి చంపాడు ఓ యువకుడు. అంతేకాదు మృతదేహాన్ని తీసుకొచ్చి తన తల్లి కాళ్లదగ్గర పడేసాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం విశాఖపట్నంలోని అల్లిపురంలో చోటుచేసుకుంది. తాగుబోతును తరిమి తరిమి చంపిన దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి.
వివరాల్లోకి వెళితే..
అల్లిపురం ప్రాంతానికి చెందిన గొంతిన శ్రీను(45) పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. అతనికి మద్యం తాగే అలవాటు ఉంది.పనులకు ఎవరు పిలిస్తే వారితో వెళ్తాడు. ఇందుకోసం రోజూ అల్లిపురం మెయిన్ రోడ్డులో గల ఎలైట్ ఇన్ లాడ్జీ జంక్షన్ వద్ద కూర్చుంటాడు. యథావిధిగా ఆదివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో శ్రీను ఎలైట్ ఇన్ లాడ్జీ జంక్షన్కు చేరుకున్నాడు.
అదే ప్రాంతానికి చెందిన గౌరి అనే మహిళ ఆదివారం ఉదయం పనిపై బయటకు వచ్చింది. ఆ సమయంలో గొంతిక శీను అనే పెయింటర్ మద్యంమత్తులో వుండి రోడ్డుపై వెళుతున్న ఆమెపై అసభ్యకర కామెంట్స్ చేసాడు. అంతటితో ఆగకుండా మహిళతో రోడ్డుపైనే గొడవకు దిగాడు.
దీంతో గౌరి తన కొడుకు ప్రసాద్ కు సమాచారమివ్వగా ఆవేశంలో అక్కడికి చేరుకున్నాడు. యువకున్ని చూసి శీను పారిపోగా వెంటపడి పట్టుకున్నాడు. ‘నా తల్లిని అవమానిస్తావా..’ అంటూ అతి కౄరంగా చంపాడు యువకుడు. అంతేకాదు మృతదేహాన్ని రోడ్డుపై ఈడ్చుకుంటూ వచ్చి తల్లి కాళ్లదగ్గర పడేసాడు. ఈ ఘటనతో విశాఖపట్నం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.