ఈ నెల 21వ తేదీ ఆదివారం నాడు సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఉదయం 10.25 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1.54 గంటల వరకూ గ్రహణం వుంటుంది. ఈ సందర్భంగా జ్యోతిష పండితులు పలు విషయాలను వెల్లడించారు. గ్రహణ పట్టు, విడుపుల సమయం మధ్య పగలు తీసుకునే ఆహారాన్ని తీసుకోకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. ఈ గ్రహణాన్ని వృషభ, మిధున రాశుల వారు చూడకుండా ఉండాలని సలహా ఇచ్చారు. జన్మ నక్షత్రాల పరంగా మృగశిర, ఆరుధ్ర, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఈ గ్రహణం కీడును కలిగించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.
గ్రహణ సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాలు మూతబడనున్నాయి. బాసర సరస్వతీ దేవాలయం, శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకూ మూతబడనుంది. సూర్య గ్రహణం సందర్భంగా విజయవాడ, తిరుపతి, శ్రీశైలం, యాదగిరిగుట్ట తదితర పుణ్యక్షేత్రాల్లోని ఆలయాలను కూడా మూసివేయనున్నారు. ఇదే సమయంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మాత్రం ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగనున్నాయి.
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ షికార్లు: కోదండరాం