అవయవ దానంపై గతంలో కంటే ఇప్పుడు కాస్త అవగాహన వచ్చిందనే చెప్పవచ్చు. దీనికోసమే కొన్ని సేవాసంస్థలు కూడా నిరంతరం కృషిచేస్తున్నాయి. అందుకే కొందరికైనా కళ్ళు సహా ఇతర అవయవాలు తిరిగి పొంది, నూతన జీవితాన్ని సాగిస్తున్నారు. అయితే అవయవదానం అంటే కళ్ళు, కిడ్నీ లాంటివి మాత్రమే కాదు, చర్మం కూడా దానం చేయవచ్చు. సాధారణంగా మనిషి శరీరంలోని కొన్ని అవయవాలను దానం చేయడం మనకు తెలిసిన విషయమే. మనిషి మరణించిన తర్వాత ఆ అవయవాలను వేరు చేసి వాటిని వేరే వాళ్లకు అమర్చుతారు. మనిషి చచ్చిపోయినా చర్మం పనికి వస్తుందని తాజా పరిశోధనలో తేలింది. మనిషి శరీరంలోని అవయవాలు దానం ఇచ్చినట్టే చర్మాన్ని కూడా దానం ఇవ్వొచ్చని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు.
బ్లడ్, ఐ, కిడ్నీ, హార్ట్ ఇలా మనిషి చనిపోయిన కొన్ని గంటల్లోనే వాటిని తీయడం జరుగుతుంది. అలాగే చర్మాన్ని కూడా వ్యక్తి మరణించిన 6 గంటల్లోగా చర్మాన్ని తీయాలి. 6 గంటల తర్వాత ఆ చర్మాన్ని తీసినా అది పనికిరాదు. ఈ చర్మాన్ని ఎలా తీస్తారంటే మనిషి వెన్ను, కాళ్ల వెనుక భాగాల నుంచి 0.3 మి.మీ మందంతో చర్మం పై పొరను మాత్రమే తీస్తారు. ఇలా తీసిన స్కిన్ను అవసరమైన వ్యక్తులను బ్లడ్ గ్రూపులతో సంబంధం లేకుండా అమర్చుతారు. మనిషి నుంచి తీసిన ఈ స్కిన్ను దాదాపు ఐదు సంవత్సరాల పాటు స్కిన్ బ్యాంకుల్లో భద్రపరుస్తారు. వీరికి ఎటువంటి రోగాలు లేవని రుజువై, 18 సంవత్సరాలు నిండి ఉంటేనే స్కిన్ని తీస్తారు. ఇలా తీసిన ఈ చర్మాన్ని.. యాసిడ్ బాధితులకు, తదితర స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి అమర్చుతారు.