టాలీవుడ్లో సింగర్ శ్రావణ భార్గవి సోషల్ మీడియాలో వివాదాస్పదమైంది. అన్నమయ్య కీర్తనపై ఆమె కొద్దిరోజుల క్రితం వ్యక్తిగత వీడియో పోస్ట్ చేశారు శ్రావణ భార్గవి.
ఈ క్రమంలో ఆమెపై వెంకటేశ్వరస్వామి భక్తులు అటు అన్నమయ్య వంశస్తులు మండిపడుతున్నారు. వెంటనే ఆమె పాడిన ‘ఒకపరి కొకపరి వయ్యారమై’ అన్నమయ్య కీర్తనను యూట్యూబ్ నుంచి డిలీట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆమెపై తిరుపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తాజాగా ఆ విషయంలో దిగొచ్చారు. ఆమె రూపొందించిన వివాదాస్పద వీడియో బ్యాగ్రౌండ్లో వినిపించే కీర్తనను తొలగించారు. ఈ సందర్భంగా ఇన్స్టా వేదికగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
నా యూట్యూబ్ ఛానల్ అభిమానులకు సంతోషాన్ని, ఉత్సాహాన్ని, మనశ్శాంతిని తీసుకొస్తుంది. నేనెప్పుడూ తెలిసి తెలిసి వివాదాలను కొని తెచ్చుకోను. నా సామాజిక మాధ్యమాల వేదికగా నెగెటివిటీని అస్సలు ప్రోత్సహించను. నేను అదే పంథాను అనుసరిస్తా. అన్నమాచార్య గారి మీద ఉన్న అపార గౌరవం, ఆరాధనతో ఇటీవల విడుదల చేసిన వీడియోలోని ఆడియోను తొలగిస్తున్నా అని తెలిపారు.
ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే, ఆ వీడియో చేయడం వెనుక ఎన్నో గంటల సమయం, శ్రమ ఉన్నాయి. అదొక అందమైన కళాఖండమని నేను నమ్ముతున్నా. ఆ వీడియో మరొక ఆడియోతో నా ఛానల్ పొస్ట్ చేస్తాను. చివరిగా.. ఎప్పుడైతే మీరు చూసే తీరు మారుతుందో అప్పుడే మార్పును కూడా చూడగలరు. దృష్టికోణం ప్రతి విషయంలోనూ ఉంది’” అని పేర్కొన్నారు.
కాగా, ఈ నెల 16న శ్రావణ భార్గవి ఆ వీడియోను పోస్ట్ చేయగా, క్షణాల్లో వైరల్ అయింది. అంతే స్థాయిలో వివాదాస్పదమైంది. ఇప్పటివరకూ ఆ వీడియోకు రెండున్నర మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోను తొలగించాలని, అన్నమయ్య వారసులుతో పాటు, అన్నమాచార్య ట్రస్ట్ సిబ్బంది కూడా డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రావణ భార్గవి తో మాట్లాడారు.
“అందులో అశ్లీలం ఏముంది చెప్పండి. మీకు దృష్టి లోపం ఉంటే ఏమీ చేయలేను. మీరు భక్తితో సరిగ్గా చూస్తే అమ్మవారే కనిపిస్తారు. మీ చూపులో లోపం ఉంది.. అది చూసుకోండి. నిండుగా దుప్పటి కప్పుకున్న అమ్మాయి కూడా మన చూపు సరిగా లేకపోతే అశ్లీలంగా కనిపిస్తుంది అంటూ శ్రావణ భార్గవి విమర్శకులకు కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చారు.
అంతేకాదు, ఆ వీడియోలో తప్పుగా ఏమీ చూపించ లేదని, తనకున్న సంగీత జ్ఞానంతో భక్తిశ్రద్ధలతో పాడానని అన్నారు. తన ఛానల్లో వీడియో తొలగించటం కుదరదని తెగేసి చెప్పారు.
దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది. ఆ వీడియోను యూట్యూబ్ నుంచి డిలీట్ చేయాల్సిందేనని ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోవడంతో తన అభిమానులు సైతం ఇబ్బంది పడుతుండటంతో చివరకు శ్రావణ భార్గవి ఆ వీడియోకు సంబంధించిన ఆడియోను మాత్రం తొలగించారు.దీంతో అన్నమయ్య వంశస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.