బెజవాడలో ఇటీవల జరిగిన వంవీటి రంగా వర్థంతి రోజున తనను చంపడానికి రెక్కీ జరుగుతోందని ఇటీవల టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన కామెంట్స్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసాయి. ఈ నేపథ్యంలో విజయవాడలోని వంగవీటి రాధా ఆఫీస్ ముందు గత కొన్నిరోజులుగా అనుమానస్పదంగా స్కూటర్ పార్క్ చేసి ఉండటం తీవ్ర కలకలం రేపింది.
అయితే స్కూటీ ఎవరు పార్క్ చేశారో తెలియకపోవడంతో అనుమానంతో రాధా అనుచరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్కూటర్ను స్వాధీనం చేసుకున్నారు. పార్క్ చేసిన స్కూటర్ ఎవరిదన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
అయితే ఈ స్కూటర్ నాని అనే వ్యక్తిది అని పోలీసుల విచారణలో వెల్లడైంది. అతడు వంగవీటి రాధా కార్యాలయం పక్కన ఉన్న ఓ స్వీట్ షాపులో పనిచేసే వ్యక్తి స్నేహితుడు అని పోలీసులు గుర్తించారు. దీంతో స్కూటర్ను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు అందులో ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.