తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎస్వీబీసీ చానల్ బోర్డులో డైరెక్టర్గా ప్రముఖ వేణుగాన విద్వాంసురాలు డాక్టర్ జయప్రద రామమూర్తిని నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు అందాయి. తెలుగు రాష్ట్రాల్లో వేణుగాన విద్వాంసురాలైన తొలి మహిళ డాక్టర్ జయప్రదే. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ఆమె ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. సమైక్యాంధ్రలో రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు. ఎంఎం కీరవాణి వంటి మ్యూజిక్ డైరెక్టర్లతో ప్రత్యేక ప్రాజెక్టుల్లో భాగస్వామి అయ్యారు.
డైరెక్టర్గా నియమితులు కావడంపై డాక్టర్ జయప్రద హర్షం వ్యక్తం చేశారు. జాతీయ కళాకారిణిగా ఇది తనకు వచ్చిన గౌరవమన్నారు. శ్రీ వేంకటేశ్వరుని సేవకు దీనిని అవకాశంగా అభివర్ణించారు. దీపావళికి ముందే తనకు పండగ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.