“మహర్షి”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న 26వ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనీల్ సుంకర, దిల్రాజు, మహేష్ నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఎ.కె ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా రూపొందిస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయ్యింది. ఈ నెల 26 నుంచి హైదరాబాద్లో సెకండ్ షెడ్యూల్ మొదలవుతుంది. తాజాగా ఈ సినిమాలో నిన్నటితరం కథానాయికల్లో ఒకరైన సంగీత కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కృష్ణవంశి దర్శకత్వంలో రవితేజ, శ్రీకాంత్ నటించిన “ఖడ్గం” సినిమాలో ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ సినిమా పిచ్చి అమ్మాయిగా నటించి తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది ఈ బ్యూటీ. వివాహమైన తరువాత కొంతకాలం పాటు నటనకి దూరమైన ఆమె, ఈ మధ్యనే తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తనకి నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఆమధ్య కొన్ని ఛానల్స్ లో జడ్జీగా కూడా వ్యవహరించారు సంగీత. మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అనిల్ రావిపూడి ఆమెను ఒప్పించినట్టుగా సమాచారం. త్వరలోనే ఆమె షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు.