ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ప్రజల ఇబ్బందులను తీర్చడానికి సబ్సిడీపై 25 రూపాయలకే కేజీ ఉల్లిపాయలను అందిస్తున్నామని ఏపీ మార్కెటింగ్ శాఖా మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం 14 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా గురువారం మీడియాతో మాట్లాడుతూ, రైతు బజార్ల ద్వారా పట్టణాల్లోని వినియోగ దారులకు సబ్సిడీపై ఉల్లిని సరఫరా చేస్తున్నామని అన్నారు. ఇందు కోసం మార్కెట్ స్థిరీకరణ నిధి నుంచి 14 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ తగినంత స్టాక్ అందుబాటులో లేదని, అందుకే గ్రామాలలో రేషన్ షాపుల ద్వారా ఉల్లిని పంపిణీ చేయలేకపోతున్నామని చెప్పారు.