“బాహుబలి” సినిమాతో తెలుగు చిత్రసీమకే కాకుండా అందులో నటించిన నటీనటులకు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించిందని. బాహుబలి ఫ్రాంచైజ్లో వచ్చిన చిత్రాలు జపాన్లో విడుదల చేయగా, అక్కడ కూడా ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. అంతేకాదు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళి, కీలకపాత్రలు పోషించిన ప్రభాస్, రానా, అనుష్కలతో పాటు ముఖ్య పాత్రలు పోషించిన సుబ్బరాజుపై కూడా జపాన్ అభిమానులు తమ అభిమానాన్ని పెంచుకున్నారు. తాజా సమాచారం ప్రకారం భళ్ళాలదేవుడు రానా కెరీర్లో హిట్ చిత్రాలుగా నిలిచిన కృష్ణం వందే జగద్గురు, నేనే రాజు నేనే మంత్రి మొదలగు చిత్రాలు జూన్ 29, 2019న జపాన్లోని స్కిప్ సిటీ కౌవాగుచ్చిలో విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయట. జపాన్కి చెందిన ఓ వ్యక్తి ఫ్యాన్ మేడ్ పోస్టర్స్తో ఈ విషయాన్ని తెలిపాడు. రానా జపాన్ అభిమాని పోస్ట్ని షేర్ చేస్తూ తనపై ఇంత ప్రేమని కురిపిస్తున్న జపాన్ అభిమానులకి ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం రానా “విరాటపర్వం” అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్నాడు.