ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి మండిపడ్డారు. రాజమండ్రిలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టంగా తేల్చి చెప్పినప్పటికీ జగన్ మాత్రం ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసం కోల్పోయేలా అడుగులు వేయొద్దని హితవు పలికారు.
పీపీఏల రద్దు సరికాదని, ఈ విషయంలో మరోమారు సమీక్షించుకోవాలని జగన్కు సూచించారు. ఇసుక విషయంలో జగన్ ప్రభుత్వానికి ఓ విధానమంటూ లేకపోవడం వల్ల రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దాదాపు 90 శాతం స్టోన్ క్రషర్లు మూతపడ్డాయని అన్నారు. ఫలితంగా పనులు లేక కూలీలు కడుపు కాల్చుకునే పరిస్థితి తలెత్తిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.