కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత డికె శివకుమార్ మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 3వ తేదీన ఢిల్లీలో సుదీర్ఘ విచారణ అనంతరం ఈడీ ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ హైకోర్టులో శివకుమార్ కు కాస్త ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దేశాన్ని విడిచి వెళ్లకూడదని కండిషన్ పెట్టింది. పాసుపోర్టును అప్పజెప్పడంతో పాటు రూ.25 లక్షల పూచీకత్తు సమర్పించాలని, ఈడీ విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఇక మరోవైపు, శివకుమార్ కు బెయిల్ లభించడంపై కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు..
ఇదివరకు శివకుమార్ అనేక మార్లు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లు కోర్టు కొట్టేసింది. తాజాగా మరోసారి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, ఆయనకు బెయిల్ను మంజూరు చేసింది. దాదాపు 50 రోజుల వరకు శివకుమార్ జైల్లోనే ఉన్నారు. నిన్న ఉదయం శివకుమార్ను కలిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆయన గురించి మాట్లాడుతూ, శివకుమార్ చాలా ధైర్యవంతుడని న్యాయస్థానంపై తనకు నమ్మకం ఉందన్నారు. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. గురువారం ఈ పిటీషన్ పై విచారణ జరగనుంది.