మొదటివారం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 3 రెండో వారం చివరికి చేరుకుంది. మొదటివారంలో హేమ ఎలిమినేట్ అవ్వగా ఆమె స్థానంలో వైల్డ్ కార్డు ఎంట్రీగా ట్రాన్సజెండర్ తమన్నా సింహాద్రి వచ్చారు. ఇక ఆ తరువాత గొడవలతో, సరదాలతో సాగిపోతోంది బిగ్ బాస్. ఈ రోజు ఎపిసోడ్లో లేదంటే రేపటి ఎపిసోడ్లో ఇంటి నుండి వెళ్ళనున్న మరో కంటెస్టెంట్ ఎవరో తెలియనుంది. ప్రస్తుతం నామినేషన్లో వరుణ్ సందేశ్, వితికా, శ్రీముఖి, హిమజ,జాఫర్, మహేష్,, పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇంటికి కెప్టెన్గా ఉన్న వరుణ్ సందేశ్ మాత్రం నామినేషన్ నుండి సేవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక శుక్రవారం జరిగిన ఎపిసోడ్లో ఇంటి సభ్యులు తమ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలని గుర్తు చేసుకొని వాటిని ఇంటి సభ్యుల ముందు వివరిస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు.
శుక్రవారం ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే అలీ రాజా తను రాజుగా ఉన్నప్పుడు ఇచ్చిన టాస్క్ కావాలని చేసింది కాదని తమన్నాకి వివరించాడు. అబ్బాయిలు.. అమ్మాయిలుగా మారితే కాస్త కామెడీగా ఉంటుందనే ఇచ్చానని తన మనసులో వేరే ఆలోచన లేదని చెప్పాడు. అలీ రాజా వివరణతో తమన్నా కాస్త శాంతించింది. ఇక గార్డెన్ ఏరియాలో కూర్చున్న రాహుల్ సిప్లిగంజ్.. పునర్నవిని డేట్కి వస్తావా అని అడిగాడు. దీంతో ఆమె నేను రిలేషన్లో ఉన్నానా లేదా అనేది కనుక్కోవా అంటూ సిప్లిగంజ్కి చురకలు అంటించింది. మరి ఆ అందగాడు ఎవరో చెప్పవా అంటూ రాహుల్, వరుణ్ సందేశ్లు పగలబడి నవ్వారు.
లగ్జరీ బడ్జెట్ సక్సెస్ ఫుల్గా పూర్తి చేసారని చెప్పిన బిగ్ బాస్ పాయింట్ల కోసం ట్రిపుల్ ఎక్స్ సోప్లో ఉన్న గోల్డ్, సిల్వర్ కాయిన్స్ దక్కించుకోవాలని చెప్పారు. వాటి ఆధారంగా పాయింట్లు చెప్పడంతో సావిత్రి, రవికృష్ణ,రోహిణి రంగంలోకి దిగి మొత్తంగా 3350 పాయింట్లు దక్కించుకున్నారు. ఆ తర్వాత పాయింట్ల ఆధారంగా లగ్జరీ బడ్జెట్ని పొందారు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్… ఇంటి సభ్యులు అందరు చిన్న పిల్లలగా మారి బాగా సందడి చేసారని చెబుతూ, ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడులు ఉంటాయి. కొన్ని చేయకుండా ఉండాల్సింది, బాధ పెట్టకుండా ఉండాల్సింది అనే సంఘటనలు ఉంటే వాటిని ఒక్కొక్కరు ఇంటి సభ్యుల ముందు చెప్పుకోవాలని సూచించారు.
టాస్క్ మొదలు కాకుండానే ఎమోషన్ గురించి చెప్పొచ్చు అని బిగ్ బాస్ చెప్పే సరికి ఏడుపు మొదలుపెట్టేసింది శివజ్యోతి. ఒక్కొక్కరుగా తమ అనుభవాలను పంచుకుంటూ ఉంటే.. శివజ్యోతి కన్నీటికి అడ్డుకట్ట వేయలేకపోయింది. నాన్స్టాప్గా ఏడుస్తూనే ఉంది. బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం అలీ తన భార్యతో జరిగిన అనుభవాన్ని వివరించాడు. చిన్న ప్రమాదంలో తన భార్య కాలు ఫ్రాక్చర్ అయిందని చెబుతూ, కావాలని చేయకపోయిన అందరి ముందు నా భార్యకి మరోసారి సారి చెబుతున్నానని అలీ చెప్పాడు. ఇక జాఫర్ తన పెద్ద అక్కకి సంబంధించిన సంఘటనలు గుర్తు చేసుకొని బాధపడ్డాడు.
తరువాత రోహిణి తనకి జరిగిన యాక్సిడెంట్ని గుర్తు చేసుకుంటూ అదొక పీడకలలా జరిగిందని చెప్పుకొచ్చింది. ఇక రవికృష్ణ తన తండ్రి కన్న కలలు నిజం చేయలేదంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు. సీరియల్స్లో హీరోగా రాణిస్తున్నప్పటికి తన తండ్రి అనుకున్న దానిని సాధించి ఉంటే ఆయన ప్రశాంతంగా ఉండే వారని చెప్పుకుంటూ ఏడ్చేశాడు. అతని బాధని చూసి సావిత్రి కూడా గుక్కపట్టి ఏడ్చింది. ఇక మహేష్ని ఆదుకున్న స్నేహితుడు అర్ధాంతరంగా చనిపోవడంతో ఆయన కూడా ఆ సంఘటనని తలచుకుంటూ చాలా బాధపడ్డాడు.
తన తండ్రి ఉన్న సమయంలో ఆయన విలువేంటో నాకు తెలియలేదు. ఆయన పోయిన తర్వాత తెలిసొచ్చింది. మీరు కూడా ఉన్నప్పుడు వారితో సరదాగా ఉండడం చేయండి. పోయిన తర్వాత బాధపడితే ఏమి రాదు అని చెప్పుకొచ్చాడు బాబా భాస్కర్. హౌజ్లో సందడి చేస్తూ బయట అల్లరి పిల్లగా ఉండే శ్రీముఖి కూడా ఈ టాస్క్లో కన్నీటి పర్యంతమైంది. చాలా భావోద్వేగానికి గురైన ఆమె తన తాత మరణించిన సమయంలో జరిగిన సంఘటనని వివరించింది.
తన తాతకి పెరాలసిస్ రాగా, ఏడెనిమిది ఏళ్ళు మంచి మీద ఉన్నాడట. నన్ను గుడియ అని పిలిచే మా తాత పెరాలసిస్ వలన సరిగ్గా పిలవలేకపోయాడు. ఆ సమయంలో చాలా బాధపడ్డాను. ఆయన చనిపోయే విషయం ముందే తెలుసుకున్న ఆయన తనన చూడాలని కోరుకున్నాడని.. కాని నన్ను చూడకుండానే చనిపోయాడంటూ.. కన్నీరు మున్నీరుగా విలపించింది. ఇప్పుడు ఇంట్లో నన్ను పలకరించే వారు ఎవరు ఉండరు. గత మూడేళ్లుగా మా అమ్మ, నాన్నని చాలా మిస్ అవుతున్నానంటూ శ్రీముఖి చెప్పుకొచ్చింది. ఇక తన జీవితంలో పశ్చాతాపం పడాల్సిన సంఘటనలేవి లేవని హిమజ చెప్పుకొచ్చింది.
తన బాధని చెప్పుకునే సమయం సావిత్రికి ఆసన్నం కావడంతో ఆమె తన లవ్ స్టోరీ గురించి వివరిస్తూ ఆ సమయంలో వాళ్ళ ఊరు వాళ్ళు, కుటుంబ సభ్యులు తనతో ఎలా ప్రవర్తించారో చెప్పుకొచ్చింది. తన భర్త తనకి ఎంతో సపోర్ట్గా ఉన్నాడని చెబుతూ తన కన్నీటి డ్యామ్ గేట్లు ఎత్తేసింది. రాహుల్ సిప్లిగంజ్ తన లైఫ్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పి అందరిని వివరించాడు. ఇక పునర్నవిని ప్రేమించిన వ్యక్తి శ్రీలంక బాంబ్ బ్లాస్ట్లో చనిపోయాడు. ఆ వ్యక్తిని తన మొండితనం, కోపం వలన మిస్ అయ్యానంటూ పునర్నవి బాధపడింది.
తనకి ఇష్టమైన బతుకు బతకాలని బయటకి వచ్చిన తమన్నా ఫీల్డ్ వర్కర్గా జాబ్ చేసిందట. తనని ఓ అబ్బాయి చాలా ప్రేమించాడు. దూరం పెడుతున్నానని ఆ అబ్బాయి ఫినాయిల్ తాగాడు. నా తల్లితండ్రులు, ఫ్రెండ్స్ సపోర్ట్ దూరం అయిన సమయంలో ఆయన నాకు చాలా సపోర్ట్ ఇచ్చాడు. కాకపోతే కొందరు ఫ్రెండ్స్ చెప్పిన కారణంగా ఆ అబ్బాయికి దూరం అయ్యాను. బ్రేకప్ అయి ఐదేళ్లు అయింది. అతనికి ఈ సందర్బంగా సారీ చెప్పాలని అనుకుంటున్నాను అని చెబుతూ తమన్నా కూడా భావోద్వేగానికి గురైంది.
ఇక అషూ రెడ్డి మాట్లాడుతూ… తన లైఫ్లో చేయకుండా ఉండాల్సింది అని చెప్పేవి పెద్దగా లేవు. కాకపోతే నేను యూఎస్లో ఏంబీఏ చేసే సమయంలో మా నాన్నమ్మ చనిపోయింది. అప్పుడు ఇండియా వచ్చేందుకు వీసా ట్రై చేసిన దొరకలేదు. మా నాన్నమ్మని చివరి చూపు చూసుకోలేకపోయాననే బాధ మాత్రం ఇప్పటికి ఉంది. అదొక్కటే నా లైఫ్లో కాస్త పశ్చాత్తాపం పడే సంఘటన అని అషూ వివరించింది. మెంటల్గా, స్ట్రాంగ్గా నన్ను తయారు చేసిన మా పిన్నిని నేను అస్సలు పట్టించుకోలేదు. షూటింగ్ బిజీ కారణంగా తనతో మట్లాడే సమయం కూడా లేదు. ఒకానొక సమయంలో మా పిన్ని హాస్పిటల్కి వెళ్లి శవంగా బయటకి వచ్చింది. ఎప్పుడు బయటకి వచ్చిందో కూడా మాకు తెలియదు అని చెబుతూ వితికా భావోద్వేగానికి గురైంది. ఇక వరుణ్ తన తండ్రి విషయంలో దురుసుగా ప్రవర్తించిన తీరుని గుర్తు చేసుకుంటూ కాస్త బాధపడ్డాడు. మొత్తానికి ఎపిసోడ్ 13 మొత్తం కాస్త భావోద్వేగ సంఘటనలతో నడవగా, నేటి ఎపిసోడ్ మాత్రం కాస్త ఫన్తోనే ఉంటుందని తెలుస్తుంది. ఈ రోజు శనివారం కావడంతో కింగ్ నాగ్ ఎంట్రీ ఉంటుంది.