భారత దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే 100 కోట్ల మైలురాయిని దాటామని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఇండియా లాంటి అధిక జనాభా ఉన్న దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ సవాళ్లతో కూడుకున్నదని.. అయితే అన్నింటినీ అధిగమించి విజయవంతంగా వ్యాక్సిన్ పంపిణీ చేపట్టామన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగం చేశారు…వ్యాక్సిన్ పంపిణీలో 100 కోట్ల డోసులు అనేది కేవలం నెంబర్ మాత్రమే కాదు అది దేశ ప్రజల బలం.. దేశ చరిత్రలో ఇదో సరికొత్త అధ్యాయం.. ఇది నవ భారత విజయం అంటూ దేశ ప్రజలనుద్దేశించి కీలక ప్రసంగం చేశారు ప్రధాని మోడీ.
పేద, ధనిక తేడా లేకుండా అందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు అందించామన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో టీకా తీసుకోవడానికి ప్రజలు ఇప్పటికీ ముందుకు రావట్లేదని గుర్తు చేశారు. భారత్లో మాత్రం 100 కోట్లమందికి టీకాలు వేయించగలిగామని సంతోషం వ్యక్తం చేశారు.
ఇండియాలో చేపట్టిన వ్యాక్సినేషన్ తో భారత ఫార్మా శక్తి ఏమిటో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పామన్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలు మనవైపే చూస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఎన్నో సవాళ్లను అధిగమించి 100 కోట్ల డోసుల మైలురాయిని చేరుకున్నట్లు ప్రధాని చెప్పారు.
ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలందరూ అపోహాలు వీడి కరోనా వ్యాక్సిన్లు తీసుకోవాలని ప్రధాని సూచించారు. సాంకేతికత వల్ల మారుమూల గ్రామాలకు వ్యాక్సిన్ల సరఫరా సాధ్యమైందన్నారు. పెద్ద పెద్ద దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ ఇప్పటికీ సమస్యగానే ఉందన్నారు.
‘‘దేశ, విదేశాల నిపుణులు అనేక ఏజెన్సీలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి చాలా సానుకూలంగా ఉన్నాయి. నేడు భారతీయ కంపెనీలలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం మాత్రమే కాదు, యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కూడా సృష్టించబడుతున్నాయి.
ఇప్పటి వరకు ఈ దేశం అది తయారు చేసింది, ఇది తయారు చేసిందని చెప్పుకుంటున్నామని.. కానీ, నేడు అన్నింటి పైనా “మేడ్ ఇన్ ఇండియా” అని ఉండటం దేశానికి ఎంతో గర్వకారణం అన్నారు.
మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా దేశంలో తయారైన వస్తువులను కొనడం, స్థానికంగా భారతీయులు తయారు చేసిన వస్తువులను కొనడాన్ని ఆచరణలో పెట్టాలి. 100 కోట్ల డోసులను పంపిణీ చేసినప్పటికీ ఇంకా కోవిడ్ ముప్పు పూర్తిగా తొలిగిపోలేదని, రాబోయే పండుగను దేశ ప్రజలంతా జాగ్రత్తగా జరుపుకోవాలని ప్రధాని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.