దుబ్బాక సమరం ముగిసిందో… లేదో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చేసాయి. ఇప్పుడు అందరి దృష్టి ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలపైనే.. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో అన్ని పార్టీలు పోటీకి సిద్ధమవుతున్నాయి.. ఇదే సమయంలో.. పొత్తుల విషయం తెరపైకి వచ్చినా.. ఎవ్వరికివారుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే జనసేన, ఇతర పార్టీలతో పొత్తు ఉండదని.. ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రకటించగా… మరోవైపు.. గ్రేటర్ ఫైట్పై కీలక ప్రకటన విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని యువ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తన ప్రకటనలో పేర్కొన్నారు జనసేన అధినేత.. తెలంగాణ రాష్ట్రంలోనూ, జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు, యువ జనసైనికుల నుంచి ఈ అంశంపై పలు విజ్ఞప్తులు వచ్చాయి. వారి వినతి మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులకు, నగర పరిధిలోని కమిటీలకు స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.. నా వద్దకు వచ్చిన కార్యకర్తలు, కమిటీల ప్రతినిధులు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై చర్చించుకున్నారు. జీహెచ్ఎంసీలోని పలు డివిజనల్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్రస్థాయిలో పని చేస్తూ.. ఇప్పటికే ప్రజల పక్షాన నిలబడ్డాయి. తమ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. వారి అభీష్టానికి అనుగుణంగా జనసేన పార్టీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపుతుంది అని తన ప్రకటనలో పేర్కొన్నారు.
next post
బీజేపీకి టీఆర్ఎస్ చాలాసార్లు మద్దతు: ఉత్తమ్