టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష రెండో రోజు ముగింపు సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు జగన్ పాలన, వైసీపీ నేతల అరాచకాలపై నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం జగన్ ఉన్మాదంతో రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ బూతులు మాట్లాడలేదని, పట్టాభి మాటలకు వైకాపా నాయకులు కొత్త అర్థాలు చెబుతున్నారని ఆక్షేపించారు.
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, ఇది ఉగ్రవాదం కాకపోతే మరేమిటి? అని చంద్రబాబు ప్రశ్నించారు. 70 లక్షల మంది కార్యకర్తల మనోభావాలు ఇక్కడున్నాయని, దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్పై దాడి ఉగ్రదాడేనని చంద్రబాబు స్పష్టం చేశారు. 100 గజాల దూరంలో డీజీపీ ఆఫీస్ ఉందని, డీజీపీ సరైన చర్యలు తీసుకుంటే ఇది జరిగేదా..? అని ప్రశ్నించారు.
మద్యం బ్రాండ్లు మార్చేందుకు ఏ ముఖ్యమంత్రి అయినా సాహసించారా ? అని ప్రశ్నించారు. ఏపీలోని మద్యం బ్రాండ్లు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా? అని నిలదీశారు. దశల వారీగా మద్యపానం నిషేధిస్తానని చెప్పిన జగన్… ఆడబిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను మద్యానికి బానిసలుగా మారుస్తున్నారన్నారు. ప్రజలు మత్తుకు బానిసై కొవిడ్ వేళ శానిటైజర్లు కూడా తాగారని గుర్తు చేశారు.మద్యం ధరలు పెరగడం వల్ల తక్కువ ధరకు లభించే గంజాయికి అలవాటు పడుతున్నారు.
హెరాయిన్ డంప్ పట్టుకున్నారు.. దీనికి ఏపీకి లింకులున్నాయని మీడియా కథనాలు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. ఇంతటి పెద్ద ఎత్తున మత్తు మందులు సరఫరా జరుగుతోంటే ప్రభుత్వం అలెర్ట్ కావద్దా..? పార్టీ నేతలపై దాడులు జరిగితే సహించాం.. డ్రగ్స్పై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి.. డ్రగ్స్రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామన్నారు.
సీఎం జగన్కు మాత్రం డ్రగ్స్పై సమీక్ష నిర్వహించే తీరిక లేదా ? అని ప్రశ్నించారు. గంజాయిపై మాట్లాడితే పోలీసులు ఆధారాలు అడుగుతున్నారని ఆక్షేపించారు. ఆధారాలు ఇస్తాం..పోలీసులు యూనిఫాం తీసేసి..గంజాయి విచారణ మాకే ఇవ్వండని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ డ్రగ్స్ వల్ల పిల్లల భవిష్యత్ పాడవుతోంది. అందుకే డ్రగ్స్ పై టీడీపీ పోరాటం చేస్తోందన్నారు చంద్రబాబు.
రాజకీయం కోసం జగన్.. తన తల్లిని, చెల్లిని ఉపయోగించుకుంటున్నారన్నారు. జైలుకెళ్లినప్పుడు జగన్ తన తల్లిని ఊరూరా తిప్పారని… చెల్లిని జగనన్న బాణం అని యాత్రలు చేయించారన్నారు. జగనన్న వదిలిన బాణం ఇప్పుడు తెలంగాణలో తిరుగుతుందని ఎద్దేవా చేశారు. తమది ధర్మపోరాటమని… ముమ్మాటికీ విజయం తమదేనని స్పష్టం చేశారు.