ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన ఆత్మహుతి దాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిలో పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) స్పష్టం చేసింది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఆదిల్ అహ్మద్ దార్తోపాటు కనీసం నలుగురైదుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఈ ఆపరేషన్లో పాలుపంచుకున్నట్లు సాక్ష్యాధారాలు లభించాయని ఎన్ఐఏ వెల్లడించింది. ఈ దాడిలో మారుతి ఈకో వాహనాన్ని వాడినట్టు నిర్దారించారు. దాడికి ఉపయోగించిన వాహనం 8 ఏళ్ల కిందట కశ్మీర్లోనే రిజిస్టర్ అయింది. ఈ వాహన యజమానిని కూడా విచారణ అధికారులు గుర్తించారు.
ఉగ్రవాదుల తన వాహనాన్ని వాడుతున్నట్లు వాహన యజమానికి కూడా తెలుసుని వాళ్లు స్పష్టం చేశారు. దాడి జరిగిన తర్వాత అతడు కనిపించకుండా పోయాడు. ఈ దాడిలో పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నదని ఎన్ఐఏ అధికారి ఒకరు వెల్లడించారు. దాడి చేసిన వాహనంలో 25 కిలోల ఆర్డీఎక్స్ను నింపినట్లు తేలింది. సరిహద్దు అవతలి నుంచే ఈ ఆర్డీఎక్స్ వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గతేడాది మార్చిలో కనిపించకుండా పోయిన అహ్మద్ దార్ అప్పటి నుంచీ జైషేతోనే ఉన్నాడనీ ఎన్ఐఏ తేల్చింది.