అధిక ధరలకు పాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. రాష్ట్రంలో పాల సరఫరా, సేకరణ తదితర అంశాలపై డెయిరీల ప్రతినిధులతో మంత్రి తలసాని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు పాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
స్విగ్గీ, బిగ్ బాస్కెట్ ద్వారా పాలు సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పాల సరఫరా వాహనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాల సరఫరా సిబ్బంది డ్రెస్ కోడ్ పాటించేలా డెయిరీలు చూడాలన్నారు. పాల సరఫరాలో సమస్యలపై కంట్రోల్ రూమ్ నంబర్ 040-2345 0624కు ఫోన్ చేసి తెలపాల్సిందిగా సూచించారు. పశుగ్రాసం అధిక ధరలకు విక్రయిస్తే దుకాణదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.