యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆర్ ఆర్ ఆర్.. ఆలియాభట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవ్గణ్లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ను వేగవంతం చేశారు రాజమౌళి..
ఈ క్రమంలో సోమవారం చెన్నైలో ‘ఆర్ఆర్ఆర్’.. చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివకార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్, ఆర్బీ చౌదరి, కలైపులి ఎస్.థాను ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ..ఈ వేడుకకు విచ్చేసిన పెద్దలందరికి ధన్యవాదాలు.. ‘ఆర్ఆర్ఆర్లో నాకు అవకాశం ఇచ్చినందుకు రాజమౌళికి థ్యాంక్స్. తమిళ డైలాగ్ రైటర్ మదన్ కార్కీకి కూడా థ్యాంక్స్. తమిళ డబ్బింగ్ చెప్పడంలో మీరు ఎంతో సాయం చేశారు.
ఈ కార్యక్రమానికి వచ్చినందుకు శివకార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్, ఆర్బీ చౌదరి, కలైపులి ఎస్.థానులకు థ్యాంక్స్. ముఖ్యంగా శివ కార్తికేయన్ గారు.. మొదటిసారి మనం కలుసుకున్నాం. మీ డెడికేషన్ కి, ప్రేమకు, అభిమానానికి చాలా చాలా థాంక్స్. మీరు ఎప్పుడు ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాను.
‘రాజమౌళి బాహుబలితోనే ప్రాంతీయ సినిమా పరిమితులను చెరిపేశారు. బాహుబలి చిత్రాని కన్నా ఎక్కువ ఇందులో కష్టపడ్డాడు. ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి సినిమా చేసి చాలా కాలం అయింది.
అప్పట్లో కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి చేశారు. బాలచందర్గారు దర్శకత్వంలో అది సాధ్యం అయింది. ఇప్పుడు మళ్లీ రాజమౌళి కారణంగా ఇది సాధ్యం అయింది.‘
ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ప్రతి సీన్ మళ్లీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎన్టీఆర్ అన్నారు. ఎందుకంటే మళ్లీ రామ్చరణ్తో స్క్రీన్ షేర్ చేసుకోవచ్చని తారక్ చెప్పారు. తనకు, చరణ్కు మధ్య ఏర్పడిన బంధానికి ఆర్ఆర్ఆర్ ముగింపు కాదు.. ఆరంభం మాత్రమేనని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. అలాగే..దయచేసి అందరు క్షేమంగా ఇంటికి వెళ్ళండి అంటూ తారక్ స్పీచ్ ముగించారు.