హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా “నిశ్శబ్దం” అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల, కోన వెంకట్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, హిందీతో పాటు మలయాళంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘నిశ్శబ్దం’ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే థియేటర్స్ కి రావలసిన ఈ సినిమా, లాక్ డౌన్ కారణంగా విడుదల తేదీని వాయిదా వేసుకుంది. అయితే ఈ సినిమాకి అమెజాన్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందనే వార్త చక్కర్లు కొడుతోంది.
లాక్ డౌన్ తరువాత థియేటర్స్ కి ఎంతవరకూ జనాలు వస్తారనేది సందేహమేనని సినీపెద్దలే చెబుతున్న నేపథ్యంలో, చాలా మంది అమెజాన్ కి తమ సినిమాలను ఇచ్చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. అలాగే ‘నిశ్శబ్దం’ నిర్మాతలు కూడా ఆసక్తిని చూపించారనీ, అయితే అందుకు అనుష్క అడ్డుపడిందనే ప్రచారం ఊపందుకుంది. అనుష్క వ్యక్తిత్వం గురించి తెలిసిన చాలామంది ఈ ప్రచారాన్ని నమ్మలేదు. ఇదే విషయాన్ని గురించి ఈ సినిమా టీమ్ స్పందిస్తూ, ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలను నమ్మవద్దంటూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.