చుక్కలనంటిన ఉల్లిపాయల ధరలపై పార్లమెంట్ దద్దరిల్లింది. పెరిగిన ఉల్లి ధర పై సభలో వాడివేడిగా చర్చ జరుగుతున్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగాన్ని పదేపదే విపక్ష సభ్యులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమలో ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు. తమ ఇంట్లో పెద్దగా ఉల్లిపాయలు తినబోమని ఆమె అన్నారు. “మా ఇంట్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి పెద్దగా వాడం. కాబట్టి మీరేమీ బాధపడకండి. ఉల్లిపాయలు పెద్దగా వాడని కుటుంబం నుంచి నేను వచ్చాను” అని ఉల్లిపాయల వినియోగం, పెరిగిన ధరలతో ఏర్పడిన కష్టాలు ఆర్థికమంత్రికి తెలియడం లేదని వ్యాఖ్యానించిన విపక్ష సభ్యులకు కౌంటర్ ఇచ్చారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి.
ఆపై నిర్మల తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, కేంద్ర ప్రభుత్వం ధరలను తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుందని తెలిపారు. భారీ ఎత్తున ఉల్లిపాయలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, అతి త్వరలో ఉల్లిపాయలు ఇండియాకు వస్తాయని, కొరత అధికంగా ఉన్న చోటుకు వీటిని సరఫరా చేస్తామని వెల్లడించారు. ఉల్లి రైతులకు, వినియోగదారులకు మధ్య కూడా మధ్యవర్తులు వ్యవస్థను శాసిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.