కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచుకోవాలంటే, లిక్కర్ అమ్మకాలే శ్రేయస్కరమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఏపీలో మద్యం రేట్లను 25 శాతం వరకు ప్రభుత్వం పెంచింది. ఢిల్లీలో మద్యం దుకాణాలను తెరిపించిన కేజ్రీవాల్ సర్కారు కరోనా రుసుము పేరుతో మందుబాబులపై బారం మోపింది. కేజ్రీవాల్ సర్కారు కూడా అన్ని రకాల మద్యం అమ్మకాలపై 70 శాతం కొత్త పన్నును విధించింది.
మద్యం బాటిల్ ఎంఆర్పీపై 70 శాతం అదనంగా వసూలు చేస్తారు. అంటే, రూ. 1000 ఉన్న బాటిల్ ఖరీదు ఇకపై రూ. 1,700 అవుతుంది. కొత్త ధరలు మంగళవారం నుంచి అమలులోకి వస్తాయని ఢిల్లీ ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది.లాక్ డౌన్ కారణంగా పన్ను వసూళ్లు మందగించిన నేపథ్యంలో నిన్న సమావేశమైన కేజ్రీవాల్ క్యాబినెట్ 70 శాతం సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.