మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గుంటూరు జిల్లా దోనేపూడిలో 1935 జూన్ 23న జన్మించిన నాదెండ్ల, 1978లో తొలిసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983లో ఎన్టీఆర్తో కలిసి టీడీపీ స్థాపనలో కీలకపాత్ర పోషించానని చెప్పే నాదెండ్ల అదే ఏడాది టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.
1984లో ఎన్టీఆర్ను పీఠం నుంచి దింపేసి సీఎం అయ్యారు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 వరకు… అంటే కేవలం నెల రోజులు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. తిరిగి 1998లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం ఎంపీగా గెలిచారు. ఆ తరువాత దశాబ్ద కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న నాదెండ్ల భాస్కరరావు తాజాగా బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ స్పీకర్గా పనిచేసిన ఆయన కుమారుడు మనోహర్ ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు.